Friday, September 24, 2010

వస్తోంది.. ఒక 'నాణ్య'మైన చరిత్ర * 'డాక్యుమెంటేషన్ ఆఫ్ కాయిన్స్'

మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని పురాతన నాణేలు దొరికాయో ఎవరైనా చెప్పగలరా? ఇంకా క్విజ్‌లకు ఎక్కని ఈ ప్రశ్నకు ఎవరికైనా జవాబు ఎలా తెలుస్తుంది? అందుకే పురావస్తు పరిశోధన మరియు మ్యూజియంల శాఖ దగ్గరికి వెళితే వాళ్లు ఠక్కున చెప్పారు 2.90 లక్షలని. అమ్మో.. అన్నిట్ని ఏం చేస్తున్నారని అడిగితే డాక్యుమెంటేషన్ అని వచ్చింది జవాబు. పూర్తవ్వగానే అన్ని వివరాలతో ఓ పెద్ద పుస్తకం తీసుకురాబోతున్నారు వాళ్లు. అయితే ఇప్పటికి ఆరోవంతు పని మాత్రమే అయింది. ఆ పనిలో బిజీగా ఉన్న ఆ శాఖ రసాయనిక పరిరక్షణ పరిశోధనశాల డిప్యూటీ డైరెక్టర్ డా.పి.గాయత్రితో మాట్లాడితే ఆవిడ వాటి గురించి ఎన్నో వివరాలు చెప్పారు..

"కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న 'డాక్యుమెంటేషన్ ఆఫ్ కాయిన్స్' ప్రాజెక్టు వల్ల చరిత్రలో అనేక కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇదొక అరుదైన కార్యక్రమం. దీని కోసం దేశంలోనే పేరొందిన నాణేల పరిశోధకుడు ఎ.కె. ఝా సహాయం తీసుకున్నాం. మొత్తం 2.90 లక్షల నాణేలలో ఇప్పటి వరకు 44 వేల నాణేల డాక్యుమెంటేషన్ పూర్తయింది. ప్రతి నాణెం బరువు, పరిమాణం, వ్యాసార్ధం, లిపిలతో పాటు ఏ కాలానికి చెందినదో తెలిపే వివరాలన్నీ ఇందులో ఉంటాయి.

అన్ని నాణేల డాక్యుమెంటేషన్ పూర్తవ్వగానే, ఫోటోలతో సహా ప్రచురిస్తారు. డాక్యుమెంటేషన్ అంటే- ప్రతి నాణెం ఎక్కడ దొరికింది..? ఏ కాలం నాటిది..? అప్పుడు పాలించిన రాజులు ఎవరు..? నాణేలకు ఇరువైపులా ఎలాంటి ముద్రలు, గుర్తులు ఉన్నాయి..? భాష ఏమిటి, బ్రాహ్మియా, ప్రాకృతమా? ఒకే పోలిక కలిగినవి ఎక్కడెక్కడ లభించాయి..? ఈ సమాచారమంతా సేకరిస్తుంది పురావస్తుశాఖ. దీనికి ల్యాబ్‌లో మా వంతు సహకారం అందిస్తున్నాం. మొత్తం నాణేల డాక్యుమెంటేషన్ పూర్తయితే చరిత్రకారులు, పురాతత్వ పరిశోధకులు, నాణేల అధ్యయనకారులకు ఎంతో పనికొస్తుంది. మరింత కచ్చితమైన చరిత్ర నిర్మాణంలో నాణేల పాత్ర ఇంకా పెరుగుతుంది.

చరిత్రను తిరగరాస్తాయి..
పురాతన నాణేలు దొరకగానే వాటిని రహస్యంగా అమ్మేసుకొని సొమ్ము చేసుకోవాలనుకుంటారు చాలామంది. ఇది చాలా తప్పు. ప్రతి పురాతన నాణెం అమ్మితే వచ్చే డబ్బుకంటే, దాన్ని సామాజిక ఆస్తిగా భద్రపరిస్తే వచ్చే ప్రయోజనమే ఎక్కువ. ఒక్కోసారి కొన్ని నాణేలు చరిత్రను తిరగరాస్తాయి. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో దొరికిన నాణేల వల్ల అదే జరిగింది. చరిత్ర చదువుకున్న అందరికీ శాతవాహనుల గురించి తెలుసు.

కానీ, తొలి రాజు ఎవ్వరనే మీమాంస ఉండేది. కోటిలింగాల తవ్వకాలలో నాణేలు లభ్యమయ్యాక- శాతవాహనుల తొలిరాజు శ్రీముఖుడు అని నిర్ధారణ అయ్యింది. విజయనగరం జిల్లాలోని కోనయ్యవలసలో లభించిన వెండి నాణేలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇలాంటి నాణేలు మన దేశంలో ఇంకెక్కడా లేవు. అలాగే కీసరగుట్టలో దొరికిన నాణేలను బట్టి ఈ ప్రాంతాన్ని విష్ణుకుండినులు పాలించినట్లు తెలుసుకున్నాం. అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరులో 5,242 సీసపు నాణేలు బయటపడ్డాయి. వాటి మీద రాజులపేర్లు లేవు. కానీ, ఒకే ఒక్క నాణెం మీద పూర్ణకుంభం బొమ్మ ఉంది.

ఎక్కడెక్కడ దొరికాయి...
నాణేలు రాజుల పేర్లనే కాదు. రాజుల ఆర్థిక పరిస్థితిని కూడా చెబుతాయి. ఇప్పటి వరకూ మనకు దొరికిన వాటిలో తూర్పుచాళుక్యులకు సంబంధించి రాగి, మిశ్రమ (జింక్, టిన్)లోహ నాణేలు ఉన్నాయి. కాకతీయుల కాలంనాటి కప్‌షేప్ కాయిన్స్, విజయనగర సామ్రాజ్యంనాటి రాగి, వెండి, బంగారు నాణేలు ఉన్నాయి. మొఘలుల కాలంలో వెండి బాగా చెలామణిలో ఉన్నట్లు దొరికినవాటిని బట్టి తెలుస్తోంది. కుతుబ్‌షాహీల కాలంనాటి రాగి రూకలు దొరికాయి. ఖమ్మం జిల్లాలో రోమన్ బంగారు నాణేలు చిక్కాయి. ఒకటవ నిజాం నుంచి ఆరవ నిజాం వరకు చార్మినార్ సిక్కాలు (నాణేలు) దొరికాక.. ఏ కాలంలో ఏ నిజాం పాలించాడో సులువుగా తెలుసుకునేందుకు వీలైంది. నాణేల మీద రాజుల పేర్లు ముద్రించుకోవడం శాతవాహనుల కాలం నుంచే మొదలైందని ఇప్పటివరకు లభ్యమైన నాణేలను బట్టి చెప్పవచ్చు.

నాణేలు లభించినప్పుడు ఎవరికి సమాచారాన్ని ఇవ్వాలో చాలామందికి తెలియదు. పొలం దున్నుతున్నప్పుడో, పాత ఇంటి పునాదులు తవ్వుతున్నప్పుడో కొన్ని చోట్ల నాణేలు బయటపడుతుంటాయి. పాటిదిబ్బలు, పురాతన దేవాలయాలు, కట్టడాలు, బౌద్ధస్థూపాలున్న ప్రదేశాలలో మా శాఖ కూడా తవ్వకాలు చేస్తుంటుంది. ఈ ప్రదేశాలను ప్రత్యేకంగా గుర్తించడానికి పురావస్తు అన్వేషకులు పనిచేస్తుంటారు.

గ్రామాలలో నాణేలు దొరికిన వెంటనే, స్థానిక సర్పంచు, పోలీసులు, రెవిన్యూ అధికారులకు సమాచారం అందించవచ్చు. వారు అక్కడే నాణేలకు పంచనామా చేసి కలెక్టర్‌కు పంపిస్తారు. జిల్లా కేంద్రంలోని ట్రెజరీలో భద్రపరుస్తారు. అక్కడి నుంచి పురావస్తు శాఖకు చేరవేస్తారు. సొంత భూముల్లో నాణేలు దొరికితే 'నిధి నిక్షేపాల చట్టం' కింద పరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఒకవేళ సమాచారం చెప్పకపోయినా నేరమే అవుతుంది.

మాకు రోజూ ఆసక్తే...
నాణేలను శుభ్రపరిచే పని హైదరాబాద్‌లోని పురావస్తు పరిశోధనశాల చేస్తుంది. ఈ శాఖకు డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నేను కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ, ఆర్కియాలజీలో పీహెచ్‌డీ చేశాను. 23 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాను. ఎక్కడెక్కడి నుంచో ఎంతో చరిత్ర కలిగిన పురాతన నాణేలు ఇక్కడికొస్తుంటాయి. అందుకే మాకు రోజూ ఆసక్తే. నాణేల మీద గుర్తులు భలే విచిత్రంగా ఉంటాయి. స్వస్తిక్, సూర్యుడు, ఏనుగు, గుర్రం, నది, చెట్టు.. ఎక్కువగా కనిపిస్తాయి. ఈ గుర్తుల వెనుక ఎన్ని రహస్యాలు ఉన్నాయో. రాజులు వీటినే ఎందుకు ఎంచుకున్నారో పరిశోధిస్తే, కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది.

ఈ ముద్రలు, అక్షరాలు దెబ్బతినకుండా నాణేలను రసాయనాలతో కడుగుతాం. నాణేలకు వాడిన లోహాలను బట్టి రసాయనాలను వాడతాం. సీసపు నాణేలను శుభ్రపరిచేందుకు హైడ్రోక్లోరిక్ ఆసిడ్‌ను వాడతాం. తర్వాత డిస్టిల్‌వాటర్‌తో కడిగి అమ్మోనియం ఎసిటేట్‌లో కాసేపు ముంచి తీసేస్తాం. నాణేలకున్న తడి ఆరిపోయాక మైక్రోక్రిస్టలైన్ వాక్స్ పూసి భద్రపరుస్తాం. రాగి నాణేలకైతే జింక్ కాస్టిక్‌ట్రీట్‌మెంట్ ఇస్తాం. వెండి, మిశ్రమలోహ నాణేలను ఫార్మిక్, సిట్రిక్‌యాసిడ్‌లతో క్లీన్ చేస్తాం. ఒక్కోసారి అల్ట్రా సోనిక్ క్లీనర్ ఉపయోగిస్తాం. అవసరమైతే డెంటల్ క్లీనింగ్ మిషిన్ వాడి పాత నాణేలను మిలమిల మెరిసేలా చేస్తాం. శుభ్రపరిచే ప్రక్రియ పూర్తయ్యాక, నాణేలను రెజిన్ (పౌడర్)లో అద్ది భద్రపరుస్తాం.

దీన్నే లాకరింగ్ అని పిలుస్తాం. ఇది నిత్యం జరిగేదే. ప్రస్తుతం పురావస్తుశాఖ దగ్గరున్న అన్ని నాణేలకు డాక్యుమెంటేషన్ మాత్రం చేస్తున్నాం..'' అంటూ ముగించారు డాక్టర్ గాయత్రి.
జూ ఆది మల్లెంపూటి
ఫోటోలు : లవకుమార్

No comments: